ఐపీఎల్-12 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే కారణం ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఆడిన ప్రతి మ్యాచ్లో మరో ఓపెనర్ జానీ బెయిర్స్టోతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అంతేకాదు చివరి వరకు క్రిజులో నిలబడి విజయాలను అందించాడు. అయితే ప్రపంచకప్ జట్టు సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ అభిమానులకు, ఫ్రాంచైజీ యాజమాన్యంకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ మెసేజ్ను రాసాడు.
'మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు, గతేడాది కూడా మద్దతుగా నిలిచారు. బాల్ టాంపరింగ్ నిషేద సమయంలో.. మళ్లీ సన్రైజర్స్ కుటుంబంలో చేరడానికి, కలిసి ఆడటానికి ఎంతో ఎదురు చూశాను. ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్ మీడియా, అభిమానులు నా పునరాగమనానికి మంచి స్వాగతం పలికారు. టోర్నీ మొత్తం మీతో ఆడటం ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో మంచి విజయాలు అందాలని కోరుకుంటున్నా' అని వార్నర్ రాసుకొచ్చారు.
ఉప్పల్ వేదికగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో వార్నర్ 81 (56 బంతుల్లో; 7 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 692 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.