
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ చెత్త రికార్డుని నెలకొల్పింది. ఈ సీజన్లో చెపాక్ వేదికగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 70 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో పదేళ్లలో ఇలా ఆరంభ మ్యాచ్లోనే తక్కువ స్కోరుకి ఔటైన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు నెలకొల్పింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
స్పిన్నర్లకి అతిగా అనుకూలించిన చెపాక్ పిచ్పై చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆర్సీబీ 17.1 ఓవర్లలోనే కుప్పకూలంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ అయిన 2008లో కోల్కతా నైట్రైడర్స్తో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. దీంతో టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే రెండుసార్లు 100లోపు ఆలౌటైన తొలి జట్టుగా బెంగళూరు చెత్త రికార్డుల్లో నిలిచింది. తాజా చెత్త రికార్డుపై ఆర్సీబీపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.