
పరిస్థితులు మాకు అనుకూలించలేదు:
మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'విజయం ఒక్కరినే వరిస్తుంది. మ్యాచ్లో పరిస్థితులు మాకు అనుకూలించలేదు, ముఖ్యంగా బ్యాటింగ్లో. సొంత మైదానంలో పిచ్ పరిస్థితులను త్వరగా అర్ధం చేసుకోలేకపోయాం. ఇంతకుముందు ఈ పిచ్లో ఆరు, ఏడు గేమ్స్ ఆడాం. పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది, బంతి బ్యాటుపైకి వస్తుందా? లేదా? అనే విషయాలు అంచనా వేయడంలో వెనుకబడిపోయాం. బ్యాటింగ్ కూడా ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది' అని ధోనీ పేర్కొన్నారు.

మెరుగైన ప్రదర్శన చేస్తాం:
'జట్టులో మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. పలు మ్యాచ్ల్లో మేం బాగా బ్యాటింగ్ చేశాం. బ్యాట్స్మెన్కి అనుభవమున్నా మంచి షాట్లు ఆడలేకపోయారు. బ్యాట్స్మెన్ పరిస్థితులు ఇంకా బాగా అర్థం చేసుకొని ఉండాల్సింది. తర్వాతి మ్యాచ్లో మేం మెరుగైన ప్రదర్శన చేస్తాం అని భావిస్తున్నా' అని ధోనీ ధీమా వ్యక్తం చేశారు.

ఫైనల్ చేరుకుంటాం:
'మా బౌలింగ్ కూడా బాగాలేదు. బ్యాట్స్మెన్కు దూరంగా బంతులు వేయలేదు. కొన్ని బంతులను సరైన ప్రదేశంలో వేయడంలో విఫలమయ్యాం. క్యాచ్లను ఒడిసిపట్టలేకపోయాం. మేము ఎక్కువ పరుగులు కూడా చేయలేదు. 130 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రతి బౌండరీ ముఖ్యమే. అయినా వాటిని నియత్రించలేకపోయాం. మ్యాచ్ ఓడడం బాధగా ఉంది. అయితే అదృష్టవశాత్తు లీగ్ దశను మేము టాప్-2లో ముగించాం. మాకు ఇంకో అవకాశం ఉంది. కచ్చితంగా ఫైనల్ చేరుకుంటాం' అని ధోనీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫైనల్లో ముంబై:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నచెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లతో సహా అందరూ విఫలమవ్వగా.. అంబటి రాయుడు (42 నాటౌట్; 37 బంతుల్లో 3×4, 1×6), ధోనీ (37 నాటౌట్; 29 బంతుల్లో 3×6) లు ఆదుకున్నారు. 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించి ఫైనల్ చేరింది. సూర్యకుమార్ యాదవ్ (71 నాటౌట్; 54 బంతుల్లో 10×4) రాణించాడు. సూర్యకుమార్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.


Click it and Unblock the Notifications












