|
రైనాను అడ్డుకున్న పంత్:
టాస్ ఓడి చెన్నై మొదటగా బ్యాటింగ్ చేయగా.. ఢిల్లీ బౌలర్ జగదీషా సుచిత్ ఓపెనర్ షేన్ వాట్సన్ను పెవిలియన్ పంపాడు. అనంతరం సురేశ్ రైనా మైదానంలోకి వచ్చాడు. ఇక క్రీజులోకి వెళుతుండగా.. పంత్ అడ్డుగా నిలబడ్డాడు. రైనా ఎటు కదిలితే.. పంత్ కూడా అటే కదులుతూ కొంత సమయం ఆటపట్టించాడు. చివరకు రైనా అతనిని తప్పించుకుని క్రీజ్లోకి వెళ్ళాడు. అనంతరం ఇద్దరు నవ్వులు పూయించారు. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూడండి.
రైనా అర్ధ సెంచరీ:
ఈ సీజన్-12లో రైనా 19, 30, 36, 16, 17, 14, 4, 58, 13, 0, 38, 2, 59 పరుగులు చేసాడు. కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. అయితే బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు. 37 బంతుల్లో 59 పరుగులతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లే ఆఫ్ మ్యాచ్ల ముందు రైనా ఫామ్ లోకి రావడం చెన్నై జట్టుకు కలిసొచ్చే అంశం.
చెన్నై విజయం:
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ (22 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రాన్ తాహిర్ నాలుగు.. జడేజా మూడు వికెట్లు తీశారు. ధోనీ ఒకే ఓవర్లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్లు చేసాడు. ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.