సుడిగాలి ఇన్నింగ్స్:
బుధవారం జరిగిన మ్యాచ్లో చెన్నై 80 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది. ముందుగా చెన్నై బ్యాటింగ్ చేయగా.. సహచర ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఈ సమయంలో క్రిజులోకి వచ్చిన ధోనీ (22 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సుడిగాలి ఇన్నింగ్స్ తో భారీ స్కోర్ అందించాడు. ఇక ఛేదనలో ధోనీ ఒకే ఓవర్లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్లు చేసాడు. మెరుపు ఇన్నింగ్స్, మెరుపు స్టంపింగ్లతో ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' దక్కింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ ఖాతాలో 17వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు చేరింది.
రోహిత్ రికార్డును సమం:
17 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులతో టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ధోనీ సమం చేసాడు. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి వీరిద్దరు మాత్రమే అత్యధికంగా అవార్డులను గెలిచారు. ప్రస్తుత ఐపీఎల్లో ధోనీ ఇప్పటివరకు 11 ఇన్నింగ్సుల్లో 358 పరుగులు చేశాడు. ఇందులో మూడు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు ఉన్నాయి. 2013లో కూడా ధోనీ మూడు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డులు అందుకున్నాడు. ఇక 2018లో 16 ఇన్నింగ్సుల్లో 445 పరుగులు చేసి చెన్నైకి కప్ అందించాడు.
ధోనీ మెరుపులు.. చెన్నై విజయం:
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రైనా (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ (22 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఇమ్రాన్ తాహిర్ నాలుగు.. జడేజా మూడు వికెట్లు తీశారు. ధోనీ ఒకే ఓవర్లో రెండు కళ్లు చెదిరే స్టంపింగ్లు చేసాడు. ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.