
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్కింగ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం విశాఖ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన చెన్నై 'సెంచరీ' నమోదు చేసింది. ఐపీఎల్ లీగ్లో చెన్నైకి ఇది వందో విజయం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 164 మ్యాచ్లు ఆడిన చెన్నై.. 100 మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్లో 100 విజయాలు అందుకున్న రెండో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చెన్నై కంటే ముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ 100 విజయాలు అందుకుంది. చెన్నై 164 మ్యాచ్లలో 100 విజయాలు అందుకోగా.. ముంబై 175 మ్యాచ్లు ఆడింది. ప్రస్తుతం ముంబై 186 మ్యాచ్లలో 106 విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక చెన్నై 164 మ్యాచ్లలో 100 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ముంబై 100 విజయాలు అందుకున్నప్పుడు చెన్నై 93 విజయాలతో ఉంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా.. కొలిన్ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్ చహర్ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు.