కోల్కతా నైట్రైడర్స్ జట్టులో సమష్టితత్వం లోపించింది. ఈ కారణంగానే మేము ప్లే ఆఫ్స్కు వెళ్లలేకపోయాం. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి అర్హులమే అని కోల్కతా అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ తెలిపారు. సీజన్ ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లిన కోల్కతా.. ఓ దశలో వరుసగా ఆరు పరాజయాలతో రేసులో వెనకపడిపోయింది. అయితే మళ్లీ పుంజుకుని రేసులోకి వచ్చినా.. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై చేతిలో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.
తాజాగా కోల్కతా నైట్రైడర్స్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కాటిచ్ మాట్లాడుతూ... 'లీగ్ను విజయాలతో ప్రారంభించాం. సొంతగడ్డపై బెంగళూరు, రాజస్తాన్ చేతిలో ఓడిపోవడం నిరాశకు గురిచేసింది. వరుస ఓటములు మా ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత దెబ్బతీసాయి.ప్లే ఆఫ్స్కు చేరాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకున్నాం. నిజానికి జట్టులో భేదాభిప్రాయాలు వచ్చాయి. సమష్టితత్వం లోపించింది. మైదానంలో కొన్ని టెన్షన్లను ఎదుర్కొన్నాం. వాటిని సరిదిద్దుకోలేకపోయాం. ఐపీఎల్కు సిద్ధమయ్యేటప్పుడు కచ్చితంగా సమైక్యత ఉండాలి' అని కాటిచ్ తెలిపారు.
'గతంలో చాలా మంది ఆటగాళ్లు బాగా ఆడడంతో కేకేఆర్ ఫ్రాంచైజీ విజయవంతమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. జట్టులో మంచి వాతావరణం లేదని, కెప్టెన్ దినేశ్ కార్తీక్ వ్యూహాలు సరిగా లేవంటూ రస్సెల్ బహిరంగంగా విమర్శించడమే ఇందుకు నిదర్శనం. ముంబైపై మా రికార్డు అంతగా బాగాలేదు. అయినా కూడా మేం బాగా ఆడలేకపోయాం. గెలిచి ప్లే ఆఫ్స్కు చేరితే బాగుండేది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి అర్హులమే. తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది' అని కాటిచ్ చెప్పుకొచ్చారు.