|
సెహ్వాగ్ లుంగీ 1, ప్యాంట్ 0 ట్వీట్
తాజాగా సెహ్వాగ్ చేసిన లుంగీ 1, ప్యాంట్ 0 ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐపీఎల్లో టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్డెవిల్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ని ఉద్దేశించి సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
ధోని అద్భుతమైన బ్యాటింగ్
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడి చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
పంత్ను ఔట్ చేసిన లుంగీ ఎంగిడి
అంతేకాదు అప్పటికే క్రీజులో నిలదొక్కుకుని ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శిస్తున్నాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ను లుంగీ ఎంగిడి పెవిలియన్కు చేర్చాడు. పంత్ ఔటవ్వడం ఢిల్లీని దెబ్బతీసింది. చివర్లో విజయ్ శంకర్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
లుంగీ, పంత్ల మధ్య పోరుగా అభివర్ణించిన సెహ్వాగ్
దీంతో ఈ మ్యాచ్ని లుంగీ, పంత్ల మధ్య పోరుగా అభివర్ణిస్తూ.. సెహ్వాగ్ లుంగీ 1, ప్యాంటు(పంత్) 0 గా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ మ్యాచ్లో పంత్ అద్భుత ప్రదర్శన చేశాడని కూడా కొనియాడారు. సెహ్వాగ్ చేసిన ట్వీట్పై క్రికెట్ అభిమానులు సైతం అదే తరహాలో స్పందిస్తున్నారు.