
హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ నుంచి తాను ఓ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తోన్న విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
ఐపీఎల్లో ఈ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒకే ప్రాంఛైజీ తరుపున కోహ్లీ ఈ పరుగులు సాధించడం విశేషం.
కోహ్లీ ఇప్పటి వరకు 5,043 పరుగులు నమోదు చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచీ కోహ్లీ బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇండియా టుడే ఛానెల్ నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఇందులో రెండు నెలల క్రితం సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆ జట్టు ఆటగాడు ఏబీ డివిలియర్స్ తనకు ఏ విధంగా సహకరించాడో వివరించాడు. 'నిజానికి కొద్దిరోజుల క్రితం ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో డివిలియర్స్ నుంచి తాను కొత్త నైపుణ్యాన్ని నేర్చుకున్నాను. నా గేమ్కు అనుగుణంగా మార్పులు చేసుకొని సర్దుబాటు చేసుకున్నా. ఇప్పటికీ ఈ విషయాన్ని ఏబీతో చెప్పలేదు' అని కోహ్లీ అన్నాడు.
ఇక, ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనున్న నేపథ్యంలో ఐపీఎల ముగిసిన తర్వాత కౌంటీల్లో ఆడే విషయంపై కూడా విరాట్ కోహ్లీ స్పందించాడు. 'ప్రజలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి ఉంటారు. వాటిని నేను గౌరవిస్తాను. నా సన్నద్ధతకు ఏది మంచిదో దాన్ని నేను అమలు చేయాలి' అని కోహ్లీ అన్నాడు.
ఇంగ్లాండ్ సిరిస్ను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ ముందుగానే అక్కడ వెళ్తుండటంతో జూన్లో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు విరాట్ కోహ్లీ దూరంకానున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఐదు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.