
హైదరాబాద్: సొంతగడ్డపై మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో మైదానంలోని అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ విధానం ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
థర్డ్ అంఫైర్ నిర్ణయంపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకింత అసహనానికి గురయ్యాడు. వాంఖడె స్టేడియంలో మంగళవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 94; 10 ఫోర్లు, 5 సిక్సులు)తో పాటు ఓపెనర్ ఎవిన్ లూయిస్ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవర్లో క్రిస్ ఓక్స్ వేసిన రెండో బంతి హార్దిక్ పాండ్యా బ్యాట్ను దాటి కీపర్ డీకాక్ చేతిలోకి వెళ్లిపోయింది. బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ నితిన్ మీనన్ దానిని ఔట్గా ప్రకటించాడు. అయితే పాండ్యా ఔట్పై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ కోరాడు.
రివ్యూలో హార్దిక్ బ్యాట్ను బంతి తగిలినట్లుగా చూపించింది. అంటే స్నిక్కో మీటర్లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చాయి. కోహ్లీతోపాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులు సైతం పాండ్యా ఔటే అని అనుకున్నారు. కానీ టీవీ అంపైర్ మాత్రం అనూహ్యంగా పాండ్యాని నాటౌట్గా ప్రకటించారు.
దీంతో షాక్కు గురైన విరాట్ కోహ్లీ పాండ్యాను నాటౌట్గా ప్రకటించడంపై మైదానంలోని అంపైర్ను ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత పాండ్యా చెలరేగిపోయాడు. అదే ఓవర్లో రెండు వరుస సిక్సులు బాదాడు. దీంతో కోహ్లీ అసహనం మరింత ఎక్కువైపోయింది. అంపైర్ వద్దకు వెళ్లి మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.