హైదరాబాద్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ చెలరేగి ఆడి జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచారు. ఈ మ్యాచ్లో వీరిద్దరూ వేగంగా హాఫ్ సెంచరీలను నమోదు చేసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఢిల్లీ డేర్డెవిల్స్తో మ్యాచ్ అనంతరం తన ఇన్స్టాగ్రామ్లో కోహ్లి డివిలియర్స్తో ఉన్న ఓ ఫోటోను ఉంచాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. 'అతనితో కలిసి బ్యాటింగ్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతా. అతను క్రీజులో ఉంటే మరో ఎండ్లో ఉండే బ్యాట్స్మన్ పని మరింత సులువవుతుంది. ఈరోజు మేం మరో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాం' అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన ఆర్సీబీకి ఇది నాలుగో విజయం మాత్రమే. ఈ ఓటమితో ఢిల్లీ డేర్డెవిల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్సీబీ, ప్లే ఆఫ్కి చేరుకోవాలంటే మిగతా మ్యాచ్లు తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు నెట్ రన్రేట్ కూడా పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది.
ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ... 'ఏబీతో కలిసి క్రీజులో ఉండటం గౌరవంగా భావిస్తాను. అతనో అద్భుతమైన ఆటగాడు. నెట్ రన్రేట్ను దృష్టిలో ఉంచుకుని మేం వేగంగా మ్యాచ్ను ముగించాలనుకున్నాం. కానీ, పాయింట్లు కీలకం. మనం గెలిచి తీరతామని ఏబీ నాతో అన్నాడు. అందుకే చివర్లో నిదానంగా ఆడాం. మేం నెలకొల్పిన భాగస్వామ్యంలో ఇది కచ్చితంగా ప్రత్యేకం' అని కోహ్లి తెలిపాడు.