హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం పూణె వేదికగా చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై బౌలర్, విండిస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావోపై ఆ జట్టు ఆటగాడు అంబటి రాయుడు అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంబటి రాయుడు... బ్రావోని బ్రెయిన్ ఉపయోగించి బౌలింగ్ చేయమని సైగలతో సూచించాడు.
ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాట్స్మన్ విజయ్ శంకర్... బ్రావో బౌలింగ్లో వరుస సిక్స్లు బాదడం రాయుడిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో రాయుడు మైదానంలో తన హావభావాలతో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బ్రావో వేసిన ఇన్నింగ్స్ 15 ఓవర్ రెండో బంతిని విజయ్ శంకర్ తొలి సిక్స్గా మలిచాడు.
దీంతో 'బంతిని బ్యాట్ కింద ఎందుకు వేస్తున్నావు.. సరిగ్గా యార్కర్లు వేయచ్చు కదా!' అని రాయుడు బ్రావోకు సూచించాడు. రాయుడు సైగలకు సంబంధించిన దృశ్యాలను టీవీలో పదేపదే చూపించారు. ఇదిలా ఉంటే బ్రావో వేసిన 19 ఓవర్లో శంకర్ ఏకంగా మూడు సిక్స్లు బాదిన సంగతి తెలిసిందే.
Shankar goes big pic.twitter.com/OpZfQjB0SM
— Videos Shots (@videos_shots) April 30, 2018
ఇందులో వరుసగా రెండు సిక్స్లు బాదాడు. ఈ సమయంలో సైతం రాయుడు తన హావభావాలతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఢిల్లీపై చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. అనంతరం భారీ బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.