
హైదరాబాద్: అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు క్రికెటర్లు బలైపోతూనే ఉంటారు. సాధారణంగా వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ, ఒకవేళ ఆ నిర్ణయమే మ్యాచ్లో కీలకమైతే మాత్రం విమర్ళలు కాచుకోవడానికి సిద్ధమవ్వాల్సిందే. బుధవారం ముంబై, కోల్కతా జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు అనంతపద్మనాభన్ ఆన్-ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేకేఆర్ బౌలర్ టామ్ కరన్స్ వేసిన 16వ ఓవర్ ఐదో బంతిని అంపైర్ నో-బాల్గా ప్రకటించి.. ఫ్రీ హిట్ ఇచ్చాడు. అయితే రీప్లేలో అది నో-బాల్ కాదని తేలింది. టామ్ క్రీజుపై నుంచే బౌలింగ్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఆ బాల్ను నో-బాల్గా ప్రకటించినందుకు బౌలర్తోపాటు కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ కూడా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది.
కాగా, మ్యాచ్ అనంతరం అంపైర్ నిర్ణయంపై ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కోల్కతా నైట్ రైడర్స్ టీమ్తోపాటు మైకేల్ క్లార్క్ వంటి కొంతమంది క్రికెటర్లు, నెటిజన్లు అంపైర్ను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు 102 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఇషాన్ వీర బాదుడుతో కోల్కతాకు భారీ టార్గెట్ను నిర్దేశించాడు. దీంతో పాటుగా ముంబై ఫీల్డర్లతో పాటు, బౌలర్లు సైతం రెచ్చిపోయి ఆడటంతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 210పరుగులు చేసింది. 19ఏళ్ల ఇషాన్ కిషన్ కేవలం 21బంతుల్లో 62పరుగులు చేశాడు. వీటిలో 5ఫోర్లు, 6సిక్సులు ఉన్నాయి. కాగా, చేధనకు దిగిన కోల్కతా జట్టు 18.1 ఓవర్లకు 108పరుగులు చేసి ఆలౌట్ అయి పరాజయం పాలైంది.