
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది జరిగే ఐపీఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా అనుమతిచ్చారు.
దీంతో వార్నర్ స్థానంలో సన్రైజర్స్ యాజమాన్యం ఎవరిని జట్టులో చేర్చుకుంటుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వార్నర్ స్థానంలో శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరీరాను జట్టులోకి తీసుకోవాలని సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొలంబోలోని బీసీసీ రిపోర్టర్ అజ్జామ్ అమీన్ ట్వీట్ చేశాడు.
దీనిపై ఇప్పటికే కుశాల్ను కలిసిన సన్రైజర్స్ యాజమాన్యం అతనితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై అటు ఐపీఎల్ నిర్వాహకుల నుంచి గానీ, ఇటు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కుశాల్ పెరీరా గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
బాల్ టాంపరింగ్కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్ బాన్క్టాఫ్ట్పై తొమిది నెలల నిషేధం విధించింది.
దీంతో స్మిత్, వార్నర్ స్థానాన్ని ఇతరులతో భర్తీ చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అనుమతిచ్చారు. స్మిత్ స్థానంలో ఇప్పటికే రహానేను రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్గా నియమించింది. ఇక, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తుందో తెలియాల్సి ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ రేసులో శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ధావన్కు గనుక కెప్టెన్సీ దక్కితే ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు భారతీయులే ఉండటం విశేషం.