
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లపై కూడా ప్రభావం చూపనుంది. ఢిల్లీ డేర్డెవిల్స్ సొంత మైదానంలో జరిగే మ్యాచ్లన్నంటినీ తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియానికి మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే గనుక జరిగితే ఢిల్లీ వాసులు ఇక ఐపీఎల్కు దూరమైనట్లే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన చివరి టెస్టుకు గాలి కాలుష్యం ఎన్ని ఇబ్బందులు కలిగించిందో తెలిసిందే. గాలి కాలుష్యం వల్ల లంక ఆటగాళ్లు ముఖాలకు మాస్క్లు ధరించి ఆడారు.
ఇరు జట్లకు చెందిన పేస్ బౌలర్లు సురంగ లక్ష్మల్, మహమ్మద్ షమీలు మైదానంలోనే వాంతులు చేసుకున్నారు. ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో కూడా ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ మ్యాచ్లు ఇక్కడ జరగడం అనుమానంగానే భావిస్తున్నారు.
బీసీసీఐ ప్రతినిధులు సైతం ఇదే భావనలో ఉన్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తన సొంత మైదానంలో నిర్వహించే మ్యాచ్లన్ని తిరువనంతపురంకు మార్చాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. దీనిపై కేరళ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జయేశ్ జార్జి మాట్లాడుతూ 'బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు' అని అన్నారు.

ఇటీవల కొత్తగా రూపొందించిన తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం అందరి మన్ననలను అందుకుంది. నవంబర్లో ఇదే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ని నిర్వహించారు. ఆ సమయంలో ఈ స్టేడియంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
ముఖ్యంగా ఈ స్టేడియంలో క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సౌకర్యలపై కోహ్లీ కొనియాడాడు. అంతేకాదు స్టేడియం నిర్మించిన తర్వాత జరిగిన తొలి టీ20 మ్యాచ్కి అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఐపీఎల్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ శాంసన్ కేరళకు చెందిన వాడే కావడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.