
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లు కమలేష్ నాగర్కోటి, శుభమాన్ గిల్, పృథ్వీ షాలను ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆదివారం జరిగిన వేలంలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలో పేసర్ కమలేష్ నాగర్కోటి ఎక్కువ ధర పలకడం విశేషం.
ఐపీఎల్ 11వ సీజన్ కోసం రెండో రోజైన ఆదివారం నిర్వహించిన వేలంలో నాగర్ కోటిని రూ.3.2 కోట్లకు, శుభమాన్ గిల్ను రూ. 1.8 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకోగా... పృథ్వీ షాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 1.2 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం జరుగుతున్న సమయంలో కమలేష్ నాగర్కోటి బాత్రూమ్లో కూర్చున్నాడంట.
ఈ విషయాన్ని వేలం అనంతరం అతడే స్వయంగా వెల్లడించాడు. వేలం తర్వాత కమలేష్ నాగర్కోటి మీడియాతో మాట్లాడుతూ 'నిజం చెప్పాలంటే నా వేలాన్ని నేను చూడలేదు. ఆ సమయంలో కొంత ఆందోళనకు గురైన నేను వెళ్లి బాత్ రూమ్లో కూర్చున్నాను. చాలా సమయం వరకు బయటికి రాలేదు. నా స్నేహితులు వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు.
'ఎవరి ఫోన్ ఎత్తలేదు. నాతో రూమ్లో ఉండే పంకజ్ యాదవ్ నాతో మాట్లాడేందుకు సోషల్మీడియా ద్వారా లైవ్లోకి వచ్చాడు. అయినా సరే మాట్లాడలేదు. నేను అందుబాటులో లేను అని మెసేజ్ పెట్టా. నా వేలం ముగిసిన వెంటనే టీవీ ఛానెల్స్ వారు ఇంటికి వెళ్లి మా కుటుంబసభ్యులను ఇంటర్వ్యూ చేశారట. వారు చాలా సంతోషంగా ఉన్నారు' అని నాగర్కోటి తెలిపాడు.
'ఇప్పటి వరకు నేను స్వయంగా మైదానానికి వెళ్లి చూసిన ఐపీఎల్ మ్యాచ్ ఒకే ఒక్కటి. అలాంటిది ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడుతున్నాను. ఈ అనుభవం చాలా గొప్పగా ఉంది. టీవీ ద్వారా బిగ్బాష్ లీగ్లో క్రిస్ లిన్ బ్యాటింగ్ చూశాను. ఇప్పుడు నాకు ఐపీఎల్ ద్వారా అతనికి నెట్స్లో బంతులేసే అవకాశం వచ్చింది. నమ్మలేకపోతున్నాను' అని నాగర్కోటి తెలిపాడు.