
హైదరాబాద్: బీసీసీఐ చాలా పటిష్టంగా ప్రణాళిక వేసి ఐపీఎల్ షెడ్యూల్ను రూపొందించింది. ఒకటి రెండు మ్యాచ్ లు మార్చమంటూ జట్టు యాజమాన్యాలు అడిగినా కుదరదంటూ నొక్కి చెప్పేసింది. కానీ, సమయం అనుకూలించక ఇప్పుడు షెడ్యూల్ మార్చే పనిలోపడింది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు మే 27వరకు జరగనున్నాయి.
ఈ మధ్యలోనే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు జరగనుండటంతో మే12వ తేదీ జరగనున్న మ్యాచ్ కు సమయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2018 మే 12న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తలపడాల్సి ఉంది. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది కొరత ఏర్పడింది.
ఒకేరోజు ఎన్నికలకు ఐపీఎల్ మ్యాచ్కు భద్రతా సిబ్బంది ఏర్పాటులో ఇబ్బందులు తలెత్తడంతో ఆ జట్టు మ్యాచ్ సమయాన్ని మార్చే యోచనలో ఉంది. ప్రత్యామ్నాయంగా బెంగుళూరు, ఢిల్లీ వేదికలను బీసీసీఐ మార్చాలని యోచిస్తోంది.
ఐపీఎల్ 11వ సీజన్లో 19వ మ్యాచ్గా 2018 ఏప్రిల్ 21న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో ఢిల్లీ తలపడాల్సి ఉంది. దానిని బెంగుళూరు వేదికగా మార్చాలని... 45వ మ్యాచ్గా 2018 మే 12న బెంగుళూరు, ఢిల్లీ జట్లు న్యూఢిల్లీ వేదికగా తలపడేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. రెండు మ్యాచ్ లు రాత్రి 8గంటలకే ఆరంభం కానున్నాయి.