
హైదరాబాద్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఐపీఎల్-2018 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ముంబై ఇండియన్స్ కోచ్గా పాంటింగ్ పని చేసి అనుభవం ఉంది. ఆయన శిక్షణలో ముంబై ఇండియన్స్ 2015లో టైటిల్ విజేతగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ను కోచ్గా నియమించేందుకు ఢిల్లీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా పాంటింగ్తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన మేరకు ఢిల్లీ మెంటర్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఢిల్లీ కోచ్ పదవికి పాంటింగే సరైన వ్యక్తిగా భావించి ఆ జట్టు యాజమాన్యం పాంటింగ్తో సమాలోచనలు చేస్తోంది. పలువురితో కోచ్ పదవికి సంబంధించి చర్చలు జరుపుతున్నామన్న విషయాన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా స్పష్టం చేశారు. ఇక, రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెడుతున్న రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా పాంటింగ్కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఢిల్లీ డేర్డెవిల్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన టీమిండియా మాజీ పేసర్ టీఏ శేఖర్ ముంబై ఇండియన్స్తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ముంబై ఇండియన్స్కు చెందిన రాబిన్ సింగ్, పరస్ ఆజట్టుని వీడనున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.