హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సులతో విరుచుకుపడ్డాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ(18), డీకాక్(53) చక్కటి శుభారంభాన్నిచ్చారు. కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ మరో ఓపెనర్ డికాక్తో చెలరేగాడు. సిక్స్లు, ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది.
35 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్ సాయంతో డికాక్ తొలుత హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ తర్వాత కొద్ది సేపటికే 23 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో ఏబీ డివిలియర్స్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. శార్దుల్ ఠాకుర్ వేసిన 13 ఓవర్లో ఏబీ ఏకంగా హ్యాట్రిక్ సిక్స్లు సాధించాడు.
No one is better than him. He is one of a kind. @ABdeVilliers17 @sherj_ #RCBvCSK #IPL2018 #cricket pic.twitter.com/HdQdaunTfi
— SAQI (@rawishz81) April 25, 2018
డివిలియర్స్ బాదిన ఓ సిక్సుకు బంతి 111 మీటర్లు ప్రయాణించి స్టేడియం రూఫ్ మీద పడింది. ఈ సీజన్లో ఇదే భారీ సిక్సర్. దీంతో ఈ సీజన్లో ఎక్కువ దూరం సిక్సు బాదిన ఆటగాడిగా ఏబీ నిలిచాడు. దీంతో ఈ ఓవర్లో డివిలియర్స్ మొత్తం 20 రాబట్టాడు. ఈ మ్యాచ్లో 5 ఓవర్ వేసిన ఇదే ఠాకూర్ కెప్టెన్ కోహ్లీ వికెట్తో పాటు ఓవర్ మెయిడిన్ చేశాడు.
ఈ మెయిడిన్కు ఏబీ డివిలియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్లో బదులు తీర్చుకుని లెక్క సరిచేసాడు. అయితే బ్రావో వేసిన 13వ ఓవర్ మొదటి బంతికి డికాక్(53) బ్రావోకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత కొంత సమయానికే తాహీర్ బౌలింగ్లో డివిలియర్స్(68) బిల్లింగ్స్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికి ఆండర్సన్ హర్భజన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్(32) దూకుడుగా ఆడుతూ పరుగులు వరద పారించాడు.
అయితే శార్ధూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ (13) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
దీంతో చెన్నైకి 206 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రేవోలు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.