
హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ వికెట్ తీసిన చెన్నై ఆల్రౌండర్ జడేజా మాత్రం కోహ్లీ వికెట్ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి సంబరాలు జరుపుకోలేదు. ఈ క్రమంలో అతనిపై ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సీజన్లో మొదట్నుంచి విఫలమవుతూ వస్తోన్న జడేజా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మాత్రం విజృంభించాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో బెంగళూరు కెప్టెన్ కోహ్లీ వికెట్ ఒకటి.
'ఇది నా తొలి బంతి.. అందుకే విరాట్ వికెట్ పడినా సంబరాలు చేసుకునేందుకు నేను ఆ సమయంలో సిద్ధంగా లేను. విరాట్ వికెట్ ఎప్పటికీ పెద్ద వికెటే' అని జడేజా వివరించాడు. అయితే జడేజా సంబరాలు చేసుకోకపోవడంపై ఇప్పుడు ట్విటర్లో అభిమానులు అతనిపై జోకులు పేలుస్తూ ఆటపట్టిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ అయిన కోహ్లీకి భయపడే జడేజా సంబరాలు చేసుకోలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇక జాతీయ జట్టులో తన స్థానం ఉంటుందో లేదో అనే సందేహంతోనే జడేజా సంబరాలకు దూరంగా ఉన్నాడని మరికొందరు పేర్కొంటున్నారు.
* విరాట్ కోహ్లీకి భయపడే జడేజా సంబరాలు చేసుకోలేదు.
* నువ్వు నీ బాస్ వికెట్ తీశావ్.. టీమిండియాలో ఇక నీకు చోటు ఉంటుందా..?
* 'నేను ఉద్దేశపూర్వకంగా ఈ వికెట్ తీయలేదు. నన్ను క్షమించు. నాకు జట్టులో చోటివ్వు' అని జడేజా కోహ్లీని వేడుకుంటాడేమో!.
* కోహ్లీ వికెట్ తీసి జడేజా మొదటిసారి షాక్కు గురయ్యాడు.
* కోహ్లీ వికెట్ తీశావ్.. నీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇక ఖతం.