
హైదరాబాద్: సంజూ శాంసన్... ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాణించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. బెంగళూరుపై సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటిగా నిలిచింది. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ 10 సిక్సర్లు బాది రాజస్థాన్ స్కోరును 200కు పైగా దాటించడంలో కీలకపాత్ర పోషించాడు.
59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ను సంజూ శాంసన్ (92నాటౌట్) తన బాధ్యతాయుత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. అంతేకాదు బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించడంలో అతడి పాత్ర అమోఘం. ఈ మ్యాచ్లో అతడు కేవలం 45 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ప్రత్యర్ధి జట్టులో విరాట్ కోహ్లీ, డివిలియర్స్లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ... వాళ్లను సైతం మరిపించే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు నితీశ్ రాణా పేరిట ఉన్న ఓ రికార్డుని శాంసన్ అధిగమించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే...
ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు అది. గతంలో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన రాణా.. కింగ్స్ పంజాబ్పై 34 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదు. దీంతో ఇప్పటివరకు రాణా పేరిట ఉన్న రికార్డుని తాజాగా శాంసన్ చెరిపేశాడు.
ఆదివారం నాటి మ్యాచ్లో ఒక్క ఫోర్ కూడా లేకుండా శాంసన్ 65 పరుగులు చేసి రాణా రికార్డుని చెరిపేశాడు. 65 పరుగుల దగ్గర కూడా మరో సిక్సర్ కొట్టి 71 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాతి బంతికే తన ఇన్నింగ్స్లో తొలి ఫోర్ కొట్టాడు. మొత్తంగా శాంసన్ ఇన్నింగ్స్లో పది సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
బెంగళూరు బౌలర్ ఉమేష్ యాదవ్ వేసిన చివరి ఓవర్లోనూ రెండు సిక్సర్లు బాది రాజస్థాన్ స్కోరును 217 పరుగులకు చేర్చాడు. అంతేకాదు ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో వందలోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కోల్కతా ఆటగాడు ఆండ్రీ రసెల్ 11 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్పై అతడు అత్యధికంగా 88 పరుగులు నమోదు చేశాడు.