
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా తనను నియమించడంతో ఎంతో ఉత్కంఠకు, ఉద్వేగానికి లోనయ్యానని భారత క్రికెటర్ అజింక్య రహానే అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో చోటు చేసుకున్న బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్స్మిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ స్థానంలో రహానేను కొత్త కెప్టెన్గా రాజస్థాన్ యాజమాన్యం నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రహానే మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 'కుటుంబం లాగా భావించే జట్టుకు నాయకత్వం వహించేందుకు ఉద్వేగంతో ఉన్నా. నా మీద నమ్మకం ఉంచి..నాకీ బాధ్యతను అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. తిరిగి రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది' అని అందులో పేర్కొన్నాడు.
'జట్టుకు నా వంతుగా ఏం చేయగలనో అది పూర్తిస్థాయిలో చేస్తా. ఉత్తమ ఆటతీరు కనబరచి మంచి విజయాలు సాధించడమే మా లక్ష్యం. మరో కొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విజయాలు సాధించడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోం, మాకు అండగా నిలిచిన అభిమానులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఈ సీజన్లో కూడా జట్టుకు మద్దతు అందిస్తారని కోరుకుంటున్నా' అని రహానె తెలిపాడు.
ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఇక, రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 9న తన తొలి మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.