హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆండ్రూ టై ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై ఈ సీజన్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లాడిన ఆండ్రూ టై 18.86 యావరేజ్తో 24 వికెట్లు తీశాడు.
దీంతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కు ఇచ్చే పర్పుల్ క్యాప్ని ఆండ్రూ టై సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్ జట్టు ఐపీఎల్ మలి దశలో పేలవ ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, ఆ జట్టు పేసర్ ఆండ్రూ టై మాత్రం చక్కటి ఆటతీరు కనబర్చాడు.
ఐపీఎల్ 11వ సీజన్లో ఆండ్రూ టై గణాంకాలు
దీంతో గత పదకొండేళ్ల ఐపీఎల్ చర్రితలో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా ఆండ్రూ టై రికార్డు నెలకొల్పాడు. షేన్ వార్న్, బ్రెట్ లీ లాంటి ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా జట్టులో ఐపీఎల్లో తలపడినప్పటికీ వారికెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను ఆండ్రూ టై అందుకున్నాడు.
ఐపీఎల్ 11వ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆండ్రూ టై 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా... 21 వికెట్లతో రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఉమేష్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 20 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.