
హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో పృథ్వీ షా ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
సీజన్లో అతనికిది రెండో మ్యాచ్. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఐపీఎల్ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా, శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
విశేషం ఏమిటంటే షా, శాంసన్ ఒక్కరోజు అటూ ఇటూ తేడా లేకుండా ఒకే వయసులో ఈ ఘనత సాధించడం. 2013లో శాంసన్ ఈ ఘనత సాధించగా, పృథ్వీ షా ఆడుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పియూష్ చావ్లా బౌలింగ్లో అతడు 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
క్రీజులో ఉన్నంత సేపు తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఇక పిన్నవయసులో ఐపీఎల్ హాఫ్ సెంచరీలు సాధించిన వారి జాబితాలో రిషబ్ పంత్(18 ఏళ్ల 212 రోజులు), ఇషాన్ కిషన్(18 ఏళ్ల 299 రోజులు), గోస్వామి(19 ఏళ్ల 1 రోజు), మనీష్ పాండే(19 ఏళ్ల 253 రోజులు)లు వరుస స్థానాల్లో ఉన్నారు.