హైదరాబాద్: పంజాబ్ జట్టు ఈ సీజన్ ఆరంభంలో దూకుడుగా ఆడి మొదటి 6 మ్యాచ్లకు గాను ఐదింటిలో గెలిచి వైభవంగా అడుగులేసింది. క్రమంగా వైఫల్యాలు చుట్టుముట్టడంతో ఆఖరి మ్యాచ్ చెన్నైతో ఆడి ఓటమికి గురై లీగ్ దశ నుంచి నిష్క్రమించి ఇంటికి చేరింది. ఈ దశలో వైఫల్యాన్ని స్పోర్టివ్గా తీసుకున్న జట్టు సహ యజమానురాలు ప్రీతి జింతా.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ గెలవాలని కోరుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చెన్నై అభిమానులకు, ధోనీ అభిమానులకు ఆసక్తికరమైన ఓ సందేశాన్ని పంపింది. 'మేము ఆడనంత వరకూ నాకు ప్రతి జట్టూ ఇష్టమే. కానీ, ధోనీకి వీరాభిమానిని కాబట్టి చెన్నై జట్టే గెలవాలనే కోరుకుంటున్నాను' అని పోస్టు చేసింది.
ఈ సీజన్లో ప్రీతిజింతా పలుమార్లు వివాదాలకు తావిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వేలంలో చిరునవ్వులు చిందిస్తూ. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆ తర్వాత స్టేడియంలో టీ షర్టులు పంచి పెడుతూ.. మ్యాచ్ జరుగుతుండగా ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ కెమెరా కన్నుల్లో మెరుస్తూ ఉండేది.
రెండేళ్ల నిషేదం అనంతరం పునరాగమనం చేసిన చెన్నై జట్టు దూకుడుగా రాణిస్తోంది. మంగళవారం హైదరాబాద్, చెన్నైల మధ్య జరిగిన మ్యాచ్తో చెన్నై ఫైనల్కు చేరిపోయింది. హోరాహోరీగా జరిగిన పోరాటంలో చెన్నై జట్టులోని డుప్లెసిస్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. చాలా తక్కువ స్కోరు 140 పరుగులను ఛేదించే క్రమంలో రెండు వికెట్లు మిగిలి ఉండగానే 19వ ఓవర్ మొదటి బంతికి విన్నింగ్ షాట్ కొట్టి చెన్నైను గెలిపించాడు.