
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ను జరగకుండా ఆపాలంటూ మద్రాసు హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బీసీసీఐ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్లు జరగకుండా నివారణ చర్యలు చేపట్టే వరకు ఐపీఎల్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఐపీఎల్లో పాల్గొనే ఎనిమిది జట్లను ఆయన తన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఐపీఎల్లో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈ ఏడాది ఐపీఎల్ను జరగకుండా ఆపాలని సంపత్ కుమార్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారి కోరారు.
ఎవరీ సంపత్ కుమార్?
పిల్ దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ గతంలో చెన్నై దర్యాప్తు అధికారిగా పని చేశారు. ఈ సమయంలో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఈయనను నాలుగు ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. అయితే గతేడాది మార్చిలో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టేయడంతో మళ్లీ విధుల్లో చేరారు.
ప్రస్తుతం తమిళనాడు పోలీస్ క్యూ బ్రాంచ్లో సంపత్ ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐపీఎల్పై నిషేధం విధించాలని కోరడం లేదని, అయితే కొత్త సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన వినతి అని సంపత్ ఆ పిల్లో స్పష్టంచేశారు.
బీసీసీఐ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ఐపీఎల్ నిర్వహించకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. తాను దాఖలు చేసిన పిల్ను బుధవారం విచారించే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలిపారు. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బుధవారమే ముంబైకి చేరుకుంది.