
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నైలో, ఇండియాలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా క్రేజ్ తగ్గలేదు. అతని ప్రదర్న కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా దూసుకుపోతోంది. జట్టు బాధ్యత తీసుకుని క్రీజులోకి దిగి విజయాన్ని సునాయాసంగా తెచ్చిపెట్టిన ధోనీపై పొగడ్తల వర్షం దేశాంతరంగా వస్తున్నాయి. ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ మంచి ముగింపునిచ్చాడు.
ఈ విజయాన్ని ధోనీ ఇన్నింగ్స్ ని పొగుడుతూ.. పాకిస్థాన్ సూపర్ లీగ్కు యాంకర్గా బాధ్యతలు నిర్వర్తించిన జైనబ్ అబ్బాస్ అనే వ్యక్తి 'ధోనీ జట్టులో ఉన్నంత వరకూ ముగింపు గురించి ఆలోచించనవసర్లేదు' అంటూ ట్వీట్ చేశాడు. దాంతో పాటు 'ప్రపంచం గుర్తుంచుకోవడానికి ధోనీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు' అంటూ పొగిడాడు. ఇదంతా మ్యాచ్ జరుగుతున్నంత సేపు చేసిన ట్వీట్ అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అనుకున్నంత పని చేశాడు ధోనీ అని మళ్లీ పోస్టు పెట్టాడు.
దాంతో జైనబ్ అబ్బాస్ పాకిస్థాన్ సూపర్ లీగ్ అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించి విరుచుకుపడ్డారు. నువ్వు పాకిస్థాన్ తో ఆడేందుకు ఇష్టపడని వాళ్లని ఎందుకు పొగుడుతున్నావ్., ఇక్కడ ఐపీఎల్ పబ్లిసిటీ చెయ్యకు, నీ వ్యక్తిగత ఇష్టాలు సిగ్గుచేటుగా ఉన్నాయి. పాకిస్థానీ ఆటగాళ్లు ఒక్కరు కూడా లేని ఐపీఎల్ ను పొగుడుతున్నావా..?, అంటూ అతనిపై మండిపడ్డారు.
ఆఖరి ఓవర్ లో చెన్నై జట్టుకు 16పరుగులు రావాల్సి ఉండగా ధోనీ సిక్సు కొట్టి ఒక్క సారిగా లక్ష్యాన్ని తగ్గించేశాడు. ఈ మ్యాచ్ లో ధోనీతో పాటుగా అంబటి రాయుడు 53బంతుల్లో 82 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాయుడు అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ బౌండరీలను బాది పడేశాడు.