
హైదరాబాద్: పొట్టి క్రికెట్ ఐపీఎల్ అనగానే వీక్షకులతో పాటు క్రికెటర్లు సైతం మంచి జోష్ మీద ఉంటారు. ప్రతి మ్యాచ్కు బాదుడుతో పాటు బౌలింగ్ లోనూ రికార్డుల మోత మోగిస్తూనే ఉంటారు. ఇదే క్రమంలో తొలి ఐపీఎల్లో నమోదైన రికార్డు బ్రేక్ అవుతుందనుకుంటే, పదకొండో సీజన్ వచ్చినా బ్రేక్ చెయ్యడం ఎవ్వరితరం కావట్లేదు.
ఐపీఎల్లో ఏటేటా అనేక రికార్డులు బ్రేక్ అవుతున్నాయ్. కానీ పాక్ బౌలర్ పేరిట ఉన్న పదకొండేళ్ల నాటి బెస్ట్ బౌలింగ్ రికార్డులను మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. అనిల్ కుంబ్లే మొదలుకొని లసిత్ మలింగా, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్ లాంటి బౌలర్లెందరో ఈ రికార్డును బద్దలుకొట్టేందుకు ప్రయత్నించినా.. దాన్ని మాత్రం ఇప్పటికీ చేధించలేకపోయారు.
పాక్ క్రికెటర్లు ఐపీఎల్ తొలి సీజన్లో మాత్రమే ఆడారు. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో దిగిన సోహెల్ తన్వీర్ చెన్నై సూపర్ కింగ్స్పై 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇవే ఇప్పటికీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. దీంతో చెన్నై ఆ మ్యాచ్లో 109 పరుగులకే కుప్పకూలింది.
మరుసటి ఏడాది కుంబ్లే 3.1 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 2016లో పూణె తరఫున ఆడిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆరు వికెట్లు తీశాడు. కానీ 19 పరుగులిచ్చాడు. 2011లో లసిత్ మలింగ ఢిల్లీపై ఐదు వికెట్లు తీసి ఊపు మీద కనిపించాడు. కానీ ఆరో వికెట్ మాత్రం తీయలేకపోయాడు. సగానికి పైగా పూర్తయిపోయిన ఐపీఎల్ 11వ సీజన్లో అయినా సొహైల్ రికార్డు బద్దలవుతుందా?