ధోని కొత్త డిమాండ్: బంతి స్టేడియం దాటితే 8 పరుగులివ్వండి


హైదరాబాద్: క్రికెట్కు సంబంధించి మహేంద్ర సింగ్ ధోని ఓ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్యాట్స్మన్ సిక్స్ బాదినప్పుడు ఆ బంతి స్టేడియం వెలుపల పడితే, మరో రెండు పరుగులు అదనంగా ఇస్తే బాగుంటుందని ధోని అభిప్రాయపడ్డాడు.
టోర్నీలో భాగంగా మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్- చెన్నై సూపర్కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 31 సిక్సర్లు, 20 ఫోర్లు నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సిక్సర్ల మోత మోగించారు.

కోల్కతా 17, చెన్నై 14 సిక్సర్లు
ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు 17 సిక్సర్లు బాదగా, చెన్నై జట్టు 14 సిక్సర్లు బాదింది. అయితే కోల్కతా జట్టు బాదిన 17 సిక్సర్లలో 11 సిక్సర్లు ఆండ్రూ రసెల్ ఒక్కడే బాదడం విశేషం. అందులో కొన్ని సిక్సర్లకు గాను బంతి స్టేడియం వెలుపల పడింది. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది.

సిక్స్తో పాటు మరో రెండు పరుగులు అదనంగా
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ 'రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడటం, ఆడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్లో ఎన్నో సిక్స్లు నమోదుయ్యాయి. ఐపీఎల్లో బ్యాట్స్మెన్ బంతిని బాదినప్పుడు అది స్టేడియం దాటి వెళ్లినప్పుడు సిక్స్తో పాటు మరో రెండు పరుగులు అదనంగా ఇస్తే బాగుంటుంది' అని జోక్ చేశాడు. రెండేళ్ల తర్వాత చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో నమోదైన ఫోర్లు, సిక్సర్ల మోతను చూసి అభిమానులు చాలా ఎంజాయ్ చేశారని ధోని అన్నాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆండ్రూ రసెల్
ఈ మ్యాచ్లో కోల్కతా ఆటగాడు ఆండ్రూ రసెల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతులు ఎదుర్కొని ఒక్క బౌండరీ, 11 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. కేవలం 27 బంతుల వ్యవధిలో పది సిక్సర్లు బాదాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించుకోవచ్చు. రసెల్ మొత్తం 11 సిక్సర్లు బాదితే అందులో ఆరు బ్రావో బౌలింగ్లో కొట్టినవే. ముఖ్యంగా మిడ్వికెట్ వైపు రసెల్ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. తొలి 11 బంతుల్లో 10 పరుగులే చేసిన రసెల్.. బ్రావో వేసిన 14వ ఓవర్లో తొలి సిక్సర్ బాది దూకుడు ప్రారంభించాడు.

బ్రావోనే వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు
ఆ తర్వాత శార్దూల్ వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మళ్లీ బ్రావో బౌలింగ్కు రాగా.. ఆ ఓవర్లో రసెల్ కొట్టిన ఓ బంతి మిడాన్లో 105 మీటర్లు ప్రయాణించి స్టేడియం అవతలపడింది. బ్రావోనే వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఒకానోక దశలో 16 బంతులకు 20 పరుగులు చేసిన రసెల్.. తర్వాతి 20 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. కాగా, టోర్నీలో భాగంగా ఏప్రిల్ 15న చెన్నై తన తదుపరి మ్యాచ్లో మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆడనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications