
హైదరాబాద్: గత కొంతకాలంగా మ్యాచ్లను గెలిపించే ఇన్నింగ్స్లు ఆడటంలో ఇబ్బంది పడుతోన్న ధోని ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ధోనిలోని పాత ఫినిషర్ను అభిమానులకు పరిచయం చేశాడు. అప్పుడెప్పుడో శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మీద ఏ స్థాయిలో ఆడాడో.. ఇప్పుడు అదే స్థాయి ఆటతీరుతో ఐపీఎల్ను మరింత రసవత్తరంగా మార్చేశాడు.
ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలర్లను ఊచకోత కోస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ను ముందుండి నడిపించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సేనపై ధోని విరుచుకుపడిన తీరు నిజంగా అద్భుతం. చాలా ప్రశాంతంగా ఆడుతూ చెన్నైని విజయతీరాలకు చేర్చాడు.
206 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ధోని క్రీజులోకి అడుగుపెట్టాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సిక్స్తో ఖాతాతో తెరిచిన ధోనీ ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు.
వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు 101 పరుగులు జోడించారంటే ధోని ఏవిధంగా ఆడాడో అర్ధం చేసుకోండి. మ్యాచ్ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్నే ధోని మార్చేశాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
చివర్లో 13 బంతుల్లో 31 పరుగులు అవసరమైన దశలో రాయుడు (53 బంతుల్లో 82; 3 ఫోర్లు, 8 సిక్సులు)ని ఉమేశ్ యాదవ్ రనౌట్ చేసినప్పటికీ.. ధోనీ ప్రశాంతంగా ఆడి మ్యాచ్ను ముగించాడు. 34 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్గా నిలిచిన ధోని ఇన్నింగ్స్లో ఒక ఫోర్, ఏడు సిక్స్లు ఉన్నాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ధోని ఇన్నింగ్స్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని.. 'ది ఫినిషర్ ఈజ్ బ్యాక్' అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.