హైదరాబాద్: చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్.. ధోనీ తాజాగా తన ఇన్స్టాగ్రాంలో ఓ వీడియోను పోస్టు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైన శైలిలో పూణెకి వీడ్కోలు పలికాడు. తన గారాల పట్టి జీవాతో కలిసి మెట్లెక్కుతూ డ్రెస్సింగ్ రూం వైపు వెళ్లిన ధోనీ.. పూణె ఫ్యాన్స్కి వీడ్కోలు చెప్పిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
'ఈ సీజన్లో చివరిసారిగా పూణె డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తున్నాను. మాకు ఎంతగానో అండగా నిలిచినందుకు పూణెకి ధన్యవాదాలు. స్టేడియం మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది. సూపర్ కింగ్స్ మిమ్మల్ని అలరించిందని భావిస్తున్నా' అని ధోనీ పూణె అభిమానులు ఉద్దేశించి రాసుకొచ్చాడు.
కావేరి జల వివాదం కారణంగా సొంతగడ్డపై చెన్నై సూపర్కింగ్స్ ఆడాల్సిన మ్యాచ్లన్నింటినీ పూణె తరలించిన సంగతి తెలిసిందే. ధోనీ సేన రెండేళ్ల విరామం తర్వాత చెన్నైలో తొలి మ్యాచ్ ఆడింది. కోల్కతాతో జరిగిన ఆ మ్యాచ్లో కావేరీ నిరసనకారులు ఆటగాళ్లపై బూట్లు విసిరారు. కావేరీ వివాదం పరిష్కారమయ్యే వరకూ మ్యాచ్కు ఆటంకం కలిగిస్తామని హెచ్చరించారు. రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ధోనీ గత రెండేళ్లు పూణెలో ఆడాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆతిథ్య మ్యాచ్లను పూణెకి తరలించారు.
పూణె ఆతిథ్యం ఇవ్వాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్లను కోల్కతాకు మారుస్తూ తర్వాత బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ధోనీ సేన పూణెలో ఆడిన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై గెలుపొందిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2లో మ్యాచ్లో ముంబై, కోల్కతాలో జరగనున్నాయి. ఇందుకోసం సోమవారమే చెన్నై జట్టు పూణె నుంచి ముంబై చేరుకుంది.