
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్కు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి అశేష అభిమాన గళాన్ని సొంతం చేసుకున్న ఆటగాళ్లలో ధోని ఒకడు. ధోని జీవితం ఆధారంగా 'ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరి' అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు.
మిస్టర్ కూల్గా పేరొందిన ధోనిఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి తెలిపేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. అయితే అభిమానులు మాత్రం ధోని వ్యక్తిగత విషయాలు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా ధోని తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేశాడు.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ధోని పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి ధోనితో పాటు.. షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, సురేశ్ రైనాతో పాటు కొంత మంది చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సైతం హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వ్యాఖ్యాత ధోనిని ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పించే ప్రయత్నం చేశాడు.

అయితే తొలుత అయిష్టత వ్యక్తంచేసిన ధోని.. అప్పట్లో ఇలాంటి ట్రెండ్ లేదని అన్నారు. చివరగా ధోని.. తన ఫస్ట్ క్రష్ స్వాతి అని తెలిపాడు. ఇది తన భార్యకు చెప్పొద్దని సరదాగా వ్యాఖ్యానించారు. తాను 1999లో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు అ అమ్మాయిపై క్రష్ ఏర్పడిందని ధోని వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ఫేస్బుక్ పేజిలో అభిమానులతో పంచుకుంది. కాగా.. ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని 2010లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ధోనికి ఒక కుమార్తె కూడా ఉంది. పేరు జీవా.