
హైదరాబాద్: చేధించాల్సింది స్వల్ప లక్ష్యమే. ఐపీఎల్ టోర్నీలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో ఒకటి. దీంతో గెలుపు సునాయాసమే అవుతుందని అభిమానులంతా భావించారు. అంతేనా... క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు నాడు మ్యాచ్ గెలిచి కానుకగా ఇస్తారని భావించారు.
కానీ, బ్యాటింగ్కు దిగిన తర్వాత పరిస్థితి తారుమారైంది. సన్రైజర్స్ హైదరాబాద్ పటిష్ట బౌలింగ్ దెబ్బకు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకున్న సన్నివేశం ఇది.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యాలను మినహాయిస్తే మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అయితే, ఈ మ్యాచ్లో పేలవ ప్రదర్శన చేసిన ముంబై ఆటగాడు హార్ధిక్ పాండ్యాపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. 19 బంతులు ఎదుర్కొని కేవలం 3పరుగులు చేసి ఔటైన హార్థిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు 19బంతుల్లో 3పరుగులు చేయడం మామూలు విషయమా? అంటూ హార్థిక్ పాండ్యాపై వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ అతి విశ్వాసమే వారి కొంప ముంచిందని కొందరు నెటిజన్లు ట్వీట్లు పోస్టు చేశారు. సన్రైజర్స్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు 87 పరుగులకే ఆలౌటైంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లాడగా కేవలం ఒక్క మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.