

హైదరాబాద్: క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. గతేడాది నుంచి ఐపీఎల్ పురస్కరించుకుని ప్రారంభ వేడుకలు నిర్వహిస్తోంది బీసీసీఐ. అయితే కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఆరు జట్ల కెప్టెన్లు ఈ ప్రారంభ వేడుకకు హాజరుకాలేకపోతున్నారట.
దీంతో ఏప్రిల్ 7న అంగరంగ వైభవంగా ఆరంభం కానున్న ఐపీఎల్-11 సీజన్ వేడుకలకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్లు మినహా మిగతా జట్ల కెప్టెన్లు వేడుకలకు హాజరుకానవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. లీగ్లోని 8 జట్ల సారథులతో కలిసి ఒక స్పెషల్ వీడియో షూట్ను చేసి, ఆ వీడియోలను ఆయా ఫ్రాంఛైలు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరాల్లో విడుదల చేస్తారని తెలిసింది.
ఆరంభ వేడుకలు జరిగిన మరుసటి రోజు రెండు మ్యాచ్లున్న నేపథ్యంలో ఆ కెప్టెన్లు హాజరుకావడం ఆటగాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని బోర్డు భావిస్తోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ.. కొన్ని లాజిస్టికల్(ప్రయాణ) సమస్యలు ఎదురవుతున్నాయని గమనించాం. వీలైనంత తొందరగా వీటిని పరిష్కరించాలని భావించాం. అన్ని జట్ల కెప్టెన్లను ఆరంభానికి ముందు రోజు ఏప్రిల్ 6న రప్పించి వారితో ప్రత్యేక వీడియో షూట్ చేసి ఆరంభ వేడుకల్లో వీటిని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. దీంతో కెప్టెన్లు తమ జట్టుకు మ్యాచ్ ఉందన్న ముందు రోజే వస్తారని అధికారులు తెలిపారు.