
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2018 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా హీత్ స్ట్రీక్ను నియమించుకుంది. ఈ మేరకు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం శనివారం అధికారిక ప్రకటన చేసింది. హీత్ స్ట్రీక్ ప్రస్తుతం జింబాబ్వే జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.
ఐపీఎల్ 2016, 17 సీజన్లలో గుజరాత్ లయన్స్ జట్టుకు స్ట్రీక్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతంలో కోల్కతా నైట్రైడర్స్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన లక్ష్మీపతి బాలాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో స్ట్రీక్ను కోల్కతా నియమించుకుంది.
కోల్కతా జట్టు హెడ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కల్లిస్ వ్వవహారిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే హీత్ స్ట్రీక్ కోల్కతా నైట్రైడర్స్ కోచింగ్ బృందంలో చేరనున్నాడు. ఈ సందర్భంగా హీత్ స్ట్రీక్ మాట్లాడుతూ అండర్-19 వరల్డ్ కప్ సాధించిన కమలేశ్ నాగర్కోటి, శివమ్ మావిలతో పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
వాళ్లిద్దరూ సాంకేతికంగా మెరుగైన స్థాయిలో ఉన్నారని, వారికి బౌలింగ్ సలహాలు ఇచ్చి అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయంగా ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లతో నిండి ఉన్న ఐపీఎల్లో అండర్-19 వరల్డ్ కప్లో ఆడిన ఆటకు పూర్తిగా భిన్నమైనదని హీత్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో బౌలర్లకు ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ ఎలా వేయాలో నేర్పించడమే ముఖ్యమైందని పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్ 2018 సీజన్కు దినేశ్ కార్తీక్ను ప్రాంఛైజీ కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 7వ తేదీన తొలి మ్యాచ్లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో డిఫెండిగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.