
హైదరాబాద్: సొంత మైదానంలో జరుగనున్న ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్లో తమ జట్టే ఫేవరేట్గా బరిలోకి దిగనుందని కోల్కతా నైట్రైడర్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. క్వాలిఫయిర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇబ్బందులు తప్పవని కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.
బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా 25 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫయిర్-2 మ్యాచ్కి ముందు కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు.
'సన్రైజర్స్ హైదరాబాద్కు ఇబ్బందులు తప్పవు. ముంబైలో ఓటమి పాలైన సన్రైజర్స్.. క్వాలిఫయర్-2లో మాతో ఆడటానికి కోల్కతాకు వచ్చింది. ఇది మా హోమ్ గ్రౌండ్.. అందుచేత ఇక్కడ మేము చాలా సులువుగా ఆడతాం. ఇక్కడ సన్రైజర్స్ గెలవడం అంత ఈజీ కాదు. క్వాలిఫయర్-2లో మేమే ఫేవరేట్స్గా బరిలోకి దిగుతున్నాం' అని అన్నాడు.
'సన్రైజర్స్తో మ్యాచ్లో గెలవడమే మా లక్ష్యం. సన్రైజర్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. అదే సమయంలో మేము వరుస నాలుగు మ్యాచ్ల్లో గెలిచాం. తదుపరి మ్యాచ్లో విజయం సాధించడంపైనే దృష్టి పెట్టాం. ఇది నాకౌట్ స్టేజ్. ఎవరు ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే' అని కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు.
'దీంతో మాకు అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని సద్వినియోగం చేసుకుని సన్రైజర్స్పై విజయం సాధిస్తాం. సన్రైజర్స్ జట్టు కూడా బలంగానే ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు' అని కుల్దీప్ యాదవ్ వివరించాడు. శుక్రవారం కోల్కతా-హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం ముంబైలోని వాంఖడె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్లో తలపడనుంది.