
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంతకముందు కింగ్స్ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన ఆటగాళ్లకు నిజంగా ఇది చేదువార్త. ఐపీఎల్ 2018 కోసం ఒకే ఒక్క ఆటగాడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకోవాలని చూస్తున్నట్లు ఆ జట్టు డైరెక్టర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
2018 సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కార్యక్రమం గురువారం ముంబైలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ బుధవారం స్పోర్ట్స్ కీడాకి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
'కేవలం ఒక్క ఆటగాడిని మాత్రమే అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నాం. అంతకముందు పంజాబ్ తరుపున అద్భుత ప్రదర్శన చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, హషీం ఆమ్లా, సందీప్ శర్మ, మోహిత్ శర్మల కోసం రైట్ టు మ్యాచ్ కార్డులను వినియోగిస్తాం. ఈసారి కొత్త టాలెంట్ను వెతికే పనిలో పడ్డాం. సందీప్ శర్మ, అక్షర పటేల్ అలాగే వెలుగులోకి వచ్చారు' అని సెహ్వాగ్ తెలిపాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహా యజమాని నెస్ వాడియా కూడా మాట్లాడుతూ 'జట్టు మొత్తాన్ని రీబిల్డ్ చేయాలని అనుకుంటున్నాం. అయితే ఈ నిర్ణయం బ్రాడ్ హాడ్జి, సెహ్వాగ్లకే వదిలేశాం' అని అన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాను తన వద్దే అట్టిపెట్టుకుంది. ఈ వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే వెసులుబాటుని ఐపీఎల్ నిర్వాహకులు కల్పించిన సంగతి తెలిసిందే.
ఇందుకు గాను జనవరి 4ని చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పాండ్యా బ్రదర్స్ను తన వద్దే అట్టిపెట్టుకుంది. రిటెన్షన్ పాలసీలో భాగంగా ఈ ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ఇక, రైట్ టు మ్యాచ్ కింద జస్ప్రీత్ బుమ్రా, పొల్లార్డ్ను ముంబై మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశముంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఐపీఎల్ సూపర్ స్టార్ సురేశ్ రైనాలను అట్టిపెట్టుకుంటుండగా... రవీంద్ర జడేజా విషయంలో కాస్త సందిగ్థత నెలకొంది. ఇక, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కాస్త అయోమయంలో ఉన్నట్లు తెలిసింది. రిషబ్పంత్, శ్రేయాస్ అయ్యర్లను ఢిల్లీ తిరిగి తీసుకునే అవకాశం ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.