
హైదరాబాద్: ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్లో ఆడే అవకాశం దక్కినందుకు లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ధోని నుంచి చాలా నేర్చుకోగలనని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. బెంగళూరు వేదికగా ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో కర్ణ్ శర్మను చెన్నై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కర్ణ్ శర్మ మాట్లాడుతూ 'చెన్నై సూపర్కింగ్స్ ప్రాంచైజీ ధోని కెప్టెన్సీలో ఆడేందుకు అవకాశం కల్పించినందుకు ఉద్వేగంతో ఉన్నా. అతనో గొప్ప కెప్టెన్. తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటను వెలికి తీయడమెలాగో ఆయనకు బాగా తెలుసు. ధోని సారథ్యంలో నేనెంతో నేర్చుకోగలనని భావిస్తున్నా' అని అన్నాడు.
'ఛాంపియన్ ప్రాంఛైజీలోని ఆటగాళ్లతో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా. చెన్నైలో గొప్ప ఆటగాళ్లున్నారు. వారితో ఆడి మరింత మెరుగైన ఆటగాడిగా అయ్యేందుకు ప్రయత్నిస్తా. చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నా. ఒత్తిడి ఉన్నా పరిస్థితులకు తగ్గట్టు బ్యాట్స్మెన్కు వైవిధ్యంగా బంతులేయడం నేర్చుకున్నా. దాంతోనే నేను మంచి ఆటగాడినయ్యా' అని తెలిపాడు.
2017-18 దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంలో కర్ణ్శర్మ కీలక పాత్ర పోషించాడు. ముంబై ఇండియన్స్ తక్కువ స్కోరుకే ఆలౌటైన సందర్భంలో ప్రత్యర్థి రైజింగ్ పుణె సూపర్జెయింట్ని తక్కువ పరుగులకే పరిమితమయ్యేలా బౌలింగ్ చేశాడు.
ఫైనల్స్లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 18 పరుగులే ఇచ్చాడు. 30 ఏళ్ల కర్ణ్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. కర్ణ్ శర్మ లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్లో కూడా చేయగలడు. జట్టుకు ఆస్తిలా భావించే కర్ణ్శర్మ చెన్నైలో ఉండటం సంతోషకరమని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నాడు.