హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అర్హత కోసం చెన్నై సూపర్కింగ్స్తో హైదరాబాద్ తలపడి ఓడింది. ఈ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇలా స్పందించాడు. ఇంకా 20 పరుగులు చేస్తే ఫలితం మరోలా ఉండేదేమో అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్తో పోరాడి హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ ఫైనల్లో చోటు దక్కించుకుంది.
మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'మా జట్టు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. తొలి బంతికే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయాం. అక్కడ నుంచే వికెట్ల పతనం మొదలైంది. బ్రాత్వైట్ బ్యాటింగ్లో రాణించాడు అతని ఇన్నింగ్స్ కాస్త ఊరటనిచ్చింది. బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మా జట్టు మరో 20 పరుగులు చేసి ఉంటే బాగుండేది.' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేన్.. 'ఒకవేళ అలా జరిగి ఉంటే మా బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని మరోలా మార్చేవారేమో. ఈ మ్యాచ్లో చెన్నై లోయర్ ఆర్డర్ను చూసి మేము కొంత నేర్చుకుని తర్వాతి మ్యాచ్లో అలా ఆడేందుకు ప్రయత్నిస్తాం. డుప్లెసిస్ చాలా బాగా ఆడాడు. చెన్నైకి ఈ విజయం అతడి వల్లే దక్కింది.' అని కేన్ అన్నాడు.
తొలి క్వాలిఫయర్లో ఓడిన సన్రైజర్స్కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్లో విజేతపై విజయం సాధిస్తే సన్రైజర్స్ ఫైనల్లో అడుగుపెట్టవచ్చు. రాజస్థాన్ రాయల్స్ - కోల్కతా నైట్రైడర్స్ మధ్య బుధవారం కోల్కతా వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.