
హైదరాబాద్: కాసులు కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడమే ముఖ్యమంటున్నాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్. ఇందులో భాగంగానే ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో తన పేరుని చేర్చలేదని చెప్పాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో రిచర్డ్సన్ మాట్లాడుతూ 'ఈ ఏడాది ఐపీఎల్ వేలంలోకి రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి. రెండోది ఆసీస్ టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం. నా వయసు 26 ఏళ్లు. ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత టెస్టు జట్టులో చోటు కోసం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడాలనుకుంటున్నాను' అని అన్నాడు.
'షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ప్రతిభ ఆధారంగానే ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోవచ్చు. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో నా పేరు చేర్చలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా' అని రిచర్డ్సన్ తెలిపాడు. ఆస్ట్రేలియా తరుపున రిచర్డ్సన్ 15 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు.
కాగా, 2013 ఐపీఎల్ సీజన్లో పూణె వారియర్స్ వేలంలో రూ.4.5 కోట్లకు రిచర్డ్సన్ను కొనుగోలు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రిచర్డ్సన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో మొత్తం 14 మ్యాచ్లాడిన రిచర్డ్సన్ 24.61 సగటుతో 18 వికెట్లు తీశాడు.
2016 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున సన్ రైజర్స్ హైదరాబాద్పై తన చివరి ఐపీఎల్ మ్యాచ్ని ఆడాడు. 'ఐపీఎల్లో ఆడకూడదని తీసుకున్న నిర్ణయం ఎంతో కఠిన నిర్ణయం. ఇలా ఎవరూ చేయరు. యంగ్ క్రికెటర్లు చాలా మంది ఐపీఎల్లో ఆడాలని తహతహలాడుతుంటారు. ఆ అనుభవాన్ని నేను పొందా' అని రిచర్డ్సన్ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.