
హైదరాబాద్: శనివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం తొలిరోజు యువ క్రికెటర్లు కోటీశ్వరులయ్యారు. ముఖ్యంగా న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోన్న యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ప్రాంఛైజీలు పెద్దమొత్తం వెచ్చించి కొనుగోలు చేశాయి.
వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న జోఫ్రా ఆర్చర్ను ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసింది. ఐపీఎల్ 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో జోఫ్రా ఆర్చర్ రికార్డు ధర పలికాడు. అతడి కోసం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 7.2 కోట్లకు సొంతం చేసుకుంది. జోఫ్రా ఆర్చర్ కనీస ధర రూ. 40 లక్షలతో ప్రారంభమవడం విశేషం.
ఎవరీ జోఫ్రా ఆర్చర్?
టీ20 స్పెషలిస్ట్గా జోఫ్రా అర్చర్కు మంచి పేరుంది. 2016లో ససెక్స్ తరపున ఆడటంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు.
ఇక, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్కు ప్రాతినిథ్య వహిస్తున్నాడు. తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్లో 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీశాడు. గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయగలడు.
34 ట్వంటీ 20 మ్యాచ్ల్లో 40కి పైగా వికెట్లు తీశాడు. మరొవైపు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్లో అతని టీ 20 స్టైక్ రేట్ 145. 45 గా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ రాయల్స్ ఈ 22 ఏళ్ల క్రికెటర్కు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.