
షేన్ వాట్సన్
గతేడాది 2017 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన షేన్ వాట్సన్ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది జరిగిన వేలంలో షేన్ వాట్సన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే, ఈ సీజన్లో తన అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ను మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేలా చేయడంలో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. 36 ఏళ్ల షేన్ వాటన్స్ ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లాడి 555 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. వాంఖడె వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో షేన్ వాట్సన్ (117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అంబటి రాయుడు
ఐపీఎల్లో చాలా ఏళ్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన అంబటి రాయుడిని ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో ఆ జట్టు యాజమాన్యం వేలానికి వదిలేసింది. దీంతో 32 ఏళ్ల రాయుడిని వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచ్లాడిన అంబటి రాయుడు 602 పరుగులు నమోదు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్లో అంబటి రాయుడిని ఆ జట్టు కెప్టెన్ ధోని ఓపెనర్గా ఆడించాడు.

కేన్ విలియమ్సన్
ఐపీఎల్ 11వ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లాడిన కేన్ విలియమ్సన్ 735 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్కు దూరం కావడంతో అతడి స్థానంలో కెప్టెన్సీ పగ్గాలను కేన్ విలియమ్సన్ అందుకుని ఆ జట్టుని విజయపథంలో నడిపించాడు.

జోస్ బట్లర్
ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్ ఒకడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఓపెనర్గా బరిలోకి దిగిన జోస్ బట్లర్ వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుని సమం చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున 13 మ్యాచ్లాడిన జోస్ బట్లర్ 155.24 యావరేజితో 548 పరుగులు సాధించాడు. జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో జోస్ బట్లర్ను రూ. 4.4 కోట్లకు రాజస్థాన్ సొంతం చేసుకుంది.

సూర్యకుమార్ యాదవ్
రాజస్థాన్ రాయల్స్కు జోస్ బట్లర్ ఎలాగైతే చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పాడో అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఈ సీజన్లో ముంబై తరుపున అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన 14 మ్యాచ్ల్లో 512 పరుగులు నమోదు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మయాంక్ మార్కండే
ఈసారి ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు మయాంక్ మార్కండే. ముంబై ఇండియన్స్కు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ మొత్తం 14 మ్యాచ్లలో 15 వికెట్లు తీశాడు. బంతుల్లో వైవిధ్యంతో పాటు.. మంచి నియంత్రణతో వికెట్లు సాధిస్తూ రాణించాడు. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియా తరుపున స్పిన్ బౌలింగ్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకపోలేదు.

ముజీబ్ జద్రాన్
ఆప్ఘనిస్థాన్కు చెందిన 17 ఏళ్ల ముజీబ్ జద్రాన్ ఈ ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 11 మ్యాచ్లాడిన ముజీబ్ 10 వికెట్లు తీశాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మన్కు చెమటలు పట్టాయి. ఈ సీజన్లో 6.99 ఎకానమీతో అద్భుత ప్రదర్శన చేసిన స్పిన్నర్లలో ముజీబ్ ఒకడు. ఐపీఎల్లో ముజీబ్ ప్రదర్శనే జూన్ 14 నుంచి టీమిండియాతో బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్లో చోటు దక్కేలా చేసింది.

రిషబ్ పంత్
ఈ ఐపీఎల్ ద్వారా టీమిండియాకు దొరికిన వికెట్కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంతే. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. ముందుగా ముంబైపై 29 బంతుల్లోనే 69 పరుగులు, బెంగళూరుపై 85 పరుగులు చేసిన రిషబ్.. చివర్లో సన్రైజర్స్పై ఏకంగా సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 63బంతులు ఆడిన పంత్ 15 ఫోర్లు, 7 సిక్సర్లతో మొత్తం 128 పరుగులు సాధించి మొత్తంగా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 14 మ్యాచ్లాడిన పంత్ 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో 684పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు.

శ్రేయాస్ అయ్యర్
గంభీర్ అనూహ్యా నిర్ణయంతో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ అటు కెప్టెన్గానూ రాణించాడు. ఆటకు కెప్టెన్సీ భారం కాదంటూ ప్రతి మ్యాచ్లోనూ దూకుడుగా ఆడుతూ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆడిన 14మ్యాచ్లలో 4 అర్ధశతకాలతో మొత్తం 411పరుగులు సాధించాడు. ఇక కోల్కతాపై అతనాడిన 93 పరుగుల ఇన్నింగ్స్ మొత్తానికే హైలైట్. ఒకవైపు దూకుడుగా ఆడుతూనే మరోవైపు టెక్నిక్తో పరుగులు రాబట్టడంలో విజయవంతమయ్యాడు.

పృథ్వీ షా
పృథ్వీ షా బ్యాటింగ్ శైలిని చూస్తే మైదానంలో సచిన్ వచ్చి ఆడుతున్నాడా? అనే రీతిలో ఉంటుంది. అండర్-19 జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహించి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పృథ్వీషాను వేలంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. సీజను మొత్తం మీద ఆడింది 9 మ్యాచ్లే అయినా ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కోల్కతాపై 62 పరుగులు, రాజస్థాన్పై 47 పరుగులు.. సన్రైజర్స్పై 65 పరుగులు అతడిలో కొత్త బ్యాట్స్మన్ను పరిచయం చేశాయి. ఈ క్రమంలో మొత్తం 9మ్యాచ్లాడిన షా 2 హాఫ్ సెంచరీలతో 245పరుగులు చేశాడు.

శుభమాన్ గిల్
అండర్-19 జట్టు నుంచి నేరుగా ఐపీఎల్-11లో అడుగుపెట్టిన మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్. కోల్కతా నైట్రైడర్స్కు ఆడిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్మెన్.. కెప్టెన్ దినేశ్ కార్తీక్తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఢిల్లీపై 37పరుగులు, చెన్నైతో జరిగిన మ్యాచ్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. మొత్తం ఈ సీజనులో 13 మ్యాచ్లాడిన శుభమాన్ గిల్ ఒక హాఫ్ సెంచరీతో 203 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












