
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్లో మ్యాచ్ జరిగే సమయ వేళల్లో నిర్వాహకులు మార్చిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్ను 5.30 గంటలకు, రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ని ఓ గంట ముందుగా అంటే 7 గంటలకు మార్చిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రాంఛైజీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి, బ్రాడ్కాస్టర్ స్టార్ టీవీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మ్యాచ్ టైమింగ్స్ మారిస్తే ఐపీఎల్నే బహిష్కరిస్తామని ఫ్రాంచైజీలు బీసీసీఐకి అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయమై బోర్డు అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియా సంస్థ కోరిక మేరకే మ్యాచ్లు జరిగే సమయాలను బీసీసీఐ మార్చిందని అన్నాడు.
చానెళ్ల డిమాండ్ మేరకు ఇలాంటి మార్పులు చేసుకుంటూ పోతే, టోర్నీకి విలువ ఉండదని ఎనిమిది ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపాడు. మ్యాచ్ టైమింగ్స్లో మార్పులు అనివార్యమైతే, ఐపీఎల్ను బహిష్కరించాలన్న ఆలోచన కూడా ఫ్రాంచైజీలకు ఉందని అతడు తెలిపాడు.
రాబోయే ఐదు సంవత్సరాలకు గాను ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ రూ. 16,347.50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ స్టార్ చానెళ్లలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని, మ్యాచ్లు జరిగే సమయాలను మార్చాలన్న సూచనకు బీసీసీఐ అంగీకరించింది.
ఐపీఎల్ టైమింగ్స్ మార్పుపై ఫ్రాంఛైజీ అధికారి ఒకరు మాట్లాడుతూ 'ఒక మ్యాచ్ జరిగే రోజుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, రెండు మ్యాచ్లు జరిగే రోజు గంటన్నర పాటు వీక్షకులు ఏదో ఒక మ్యాచ్కు దూరమవుతారు' అని చెప్పాడు. అందుకు ఫ్రాంచైజీలు సుముఖత వ్యక్తం చేయడం లేదని పేర్కొన్నాడు.