
బెన్స్టోక్స్ రూ.12.5కోట్ల ధర
2017 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్. అదే జోరు ఈ ఏడాది కొనసాగిస్తాడని ఆశించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అతడు పెద్ద స్ట్రోక్ ఇచ్చాడు. తనకు వెచ్చించిన ధరకు అతడు న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5కోట్ల ధర పలికాడు. ప్రపంచ క్రికెట్లో మేటి ఆల్రౌండర్గా పేరొందిన స్టోక్స్ బ్యాట్తో 196 పరుగులు చేయగా.. బంతితో కేవలం 8 వికెట్లు తీశాడు.

అరోన్ ఫించ్ రూ.6.2 కోట్లకు
పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డు కలిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ను పంజాబ్ ఫ్రాంఛైజీ పోటీపడి రూ.6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కనీసం ఒక్క మ్యాచ్లోనూ చెప్పుకోదగ్గస్థాయిలో రాణించలేకపోయాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్ల్లో మిడిలార్డర్..మరికొన్నింట్లో ఓపెనర్గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది. చివరికి పంజాబ్ సహయాజమాని ప్రీతిజింతాకు నిరాశనే మిగిల్చాడు.

మనీశ్ పాండే రూ.11కోట్లు
మిడిలార్డర్లో సత్తాచాటే ఆటగాడి కోసం టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న మనీశ్ పాండేపై సన్రైజర్స్ హైదరాబాద్ గంపెడు ఆశలు పెట్టుకుంది. అతని కోసం వేలంలో పోటీపడి రూ.11కోట్లు ఖర్చు చేసింది. ఒక్క మ్యాచ్లో అర్ధశతకం మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో దేశవాళీ ఆటగాడి కన్నా చెత్త ప్రదర్శన చేశాడు. తన ఆటతీరుతో విసిగిపోయిన అభిమానులు ఏకంగా సోషల్మీడియాలో విమర్శలు గుప్పించారు. ఫ్రాంఛైజీ సైతం విసిగిపోయి క్వాలిఫయర్-2తో పాటు కీలకమైన ఫైనల్ మ్యాచ్కు అతన్ని దూరం పెట్టింది. టోర్నీలో కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు.

గ్లెన్ మాక్స్వెల్ రూ.9కోట్లకు
టీ20 క్రికెట్లో మంచి రికార్డు కలిగిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు. గతేడాది భారీ ఇన్నింగ్స్లు ఆడిన మ్యాక్సీ కోసం ఢిల్లీ డేర్డెవిల్స్ రూ.9కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. అతడి పేలవ ప్రదర్శన ఢిల్లీ విజయావకాశాలను దెబ్బతీసింది. జట్టులో అతని కన్నా తక్కువ అనుభవం ఉన్న రిషబ్ పంత్తో పాటు కుర్రాళ్లు బౌలర్లకు చుక్కలు చూపించి సంచలన ప్రదర్శన చేశారు. దాదాపు ప్రతి మ్యాచ్లో ఆడిన అతడు అన్నింట్లో విఫలమయ్యాడు. 2018 సీజన్లో కేవలం 169 పరుగులు చేసి.. 5 వికెట్లకే పరిమితమయ్యాడు.

జయదేవ్ ఉనద్కత్ రూ.11.5 కోట్లు
వేలంలో భారత క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు జయదేవ్ ఉనద్కత్. గతేడాది(ఐపీఎల్-10 సీజన్లో 24 వికెట్లు) ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని పేస్ భారాన్ని మోస్తాడని భావించి రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.11.5 కోట్లు కుమ్మరించింది. ఐపీఎల్-2018లో పేలవ ప్రదర్శన చేసిన అతడు కేవలం 11 వికెట్లు మాత్రమే తీసి ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.


Click it and Unblock the Notifications












