హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ కోసం బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో ఐపీఎల్ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో భాగంగా తొలిరోజు మురళీ విజయ్ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కబర్చలేదు. వేలంలో తనను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోతే పుజారా, ఇషాంత్ శర్మల మాదిరిగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడాలని అనుకున్నానని విజయ్ తెలిపాడు.
తనను వేలంలో తొలిరోజు ఏ ప్రాంచైజీ తీసుకొకపోవటంతో నిరాశ చెందినా, చివరకు చెన్నె సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడం సంతృప్తి నిచ్చిందని మురళీ విజయ్ వెల్లడించాడు. గురువారం ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న మురళీ విజయ్ మాట్లాడుతూ ఐపీఎల్లో తిరిగి సొంత జట్టుకు ఆడటం పట్ల సంతోషంగా ఉందని తెలిపాడు.
తాను వేలంలో తొలిరోజు అమ్ముడుపోకపోవడంతో చాలా మంది తనను అప్రోచ్ అయ్యారని తెలిపాడు. వేలంలో తనను ఎవరూ కొనుగోలు చేయకపోతే కౌంటీ క్రికెట్ ఆడేందుకు కూడా తాను సిద్ధమైనట్లు మురళీ విజయ్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇదొక అనుభవంగా ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
Catching up with the Champion! #WhistlePodu #HomeSweetDen 🦁💛 pic.twitter.com/vj3PN0UaJi
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2018
ఇది తనకు సీఎస్కే ఇచ్చిన గొప్ప అవకాశమని, వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని విజయ్ అన్నాడు. ప్రతి ఆటగాడు సీఎస్కేను తమ జట్టుగా భావించి సమష్టిగా రాణించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపాడు. ఈసారి ధోని సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
టీ20 ఫార్మాట్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు మురళీ విజయ్ చెప్పాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఓటమిపై కూడా మురళీ విజయ్ స్పందించాడు.
బౌలర్లు అద్బుత ప్రదర్శన చేసినా, బ్యాటింగ్ వైపల్యంతో ఓటమి చవిచూసామని, బ్యాట్స్మెన్కు ఈ సిరీస్ గుణపాఠం లాంటిదని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో జరిగే సిరీస్లపై దృష్టి పెట్టానని విజయ్ వివరించాడు.
ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్లో 2010లో జరిగిన ఫైనల్ తన అమితమైన ఆసక్తి కలిగించిందని విజయ్ అన్నారు. ఇదిలా ఉంటే గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు మురళీ విజయ్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.