హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందు ఢిల్లీ డేర్డెవిల్స్ ప్రాంఛైజీలో కీలక పరిణామం చోసుకుంది. ఇప్పటివరకు వంద శాతం వాటా కలిగిన జీఎంఆర్ గ్రూప్కు చెందిన ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో 50 శాతం వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్డబ్ల్యూ) స్పోర్ట్స్ కొనుగోలు చేసింది.
ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని శుక్రవారం జీఎంఆర్, జేఎల్డబ్ల్యూ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఢిల్లీ జట్టును మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జీఎమ్ఆర్ గ్రూప్ తెలిపింది.
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఒక ఫ్రాంఛైజీ తన వాటాను అమ్మడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ ఒప్పందానికి బీసీసీఐ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. మార్చి 16న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఒప్పందానికి ముందు ప్రస్తుతం ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు విలువను రూ. 1100 కోట్లుగా నిర్ధారించారు. దీంతో జేఎస్డబ్ల్యూ ఈ ఒప్పందం కోసం రూ. 550 కోట్లను చెల్లించనుంది. పదేళ్ల ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టైటిల్ విజేతగా ఒక్కసారి కూడా నిలవలేదు.
2008 సీజన్లో మాత్రం ఆ జట్టు సెమీఫైనల్ వరకు వెళ్లగలిగింది. 2012లో మూడో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్ల జెర్సీలపై జేఎస్డబ్ల్యూ లోగో కనిపించనుంది. కాగా, ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఎఫ్సి జట్టుకు జేఎస్డబ్ల్యూ స్పాన్సర్గా వ్యవహారిస్తోంది.