
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కెప్టెన్ను త్వరలో ప్రకటించనున్నట్లు సన్రైజర్స్ సీఈఓ షెన్ముగమ్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
దీంతో కెప్టెన్సీ రేసులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని యాజమాన్యం కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు ప్రోత్సహించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ను తప్పించిన ఆ జట్టు యాజమాన్యం అతడి స్థానంలో కొత్త కెప్టెన్గా అజ్యింకె రహానేకు బాధ్యతలు అప్పగించింది. కేప్టౌన్లో జరిగిన టెస్టులో స్మిత్, బాన్క్రాప్ట్, వార్నర్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురినీ తక్షణం జట్టు నుంచి తప్పిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో సన్రైజర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్ బుధవారమే దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరనున్నారు. వీరి స్థానంలో నాలుగో టెస్టు కోసం రెన్షా, గ్లెన్ మాక్స్వెల్, జో బర్న్స్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. బాల్ టాంపరింగ్ వివాదం బయటపడ్డ మరుక్షణమే స్మిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో టిమ్ పైన్కు బాధ్యతలు అప్పగించారు.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు టిమ్ ఫైన్ పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బాన్క్రాఫ్ట్ల త్రయానికి మాత్రమే ఈ విషయం గురించి తెలుసని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేపట్టిన విచారణలో వెల్లడైంది. బాల్ టాంపరింగ్ వివాదంలో మిగతా ఆటగాళ్ల ప్రమేయం ఏమాత్రం లేదని, వారంతా అమాయకులేనని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు.
కేప్టౌన్లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక అనంతరం సదర్లాండ్ టాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే దోషులని ప్రకటించాడు. అయితే విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ ముగ్గురిపై ఇప్పుడే చర్యలు తీసుకోలేమని చెప్పాడు.
ఇంకో 24 గంటల తర్వాత తుది నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా చర్యలు ప్రకటిస్తామని సదర్లాండ్ తెలిపాడు. దీంతో బుధవారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్ భవితవ్యమేమిటో తెలుస్తుంది. స్మిత్, వార్నర్పై సీఏ ఏడాది నిషేధం విధించడం ఖాయమని ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే వీరిద్దరూ ఐపీఎల్ 11వ సీజన్కు పూర్తిగా దూరమవుతారు.