
హైదరాబాద్: ఐపీఎల్ 11లో భాగంగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించింది. ఆఖరి వరకూ ఉత్కంఠతో సాగి చివరికి విజయాన్ని సాధించే చెన్నై జట్టు ఈ సారి పరాజయం పాలైంది. అయినా చెన్నై కెప్టెన్ మళ్లీ అదే స్థాయిలో పోటీపడేందుకు జట్టును కసరత్తు చేయిస్తున్నాడు. ధోనీ శిక్షణ ఎలా ఉంటుందంటే జట్టు ఏదనేది కాకుండా అందరికీ సమానంగా చెప్తుంటాడు. ఇలాగే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్ కు తనదైన శైలిలో పాఠాలు చెప్పాడు.
ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ ఎక్కడైనా మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడంలో మహేంద్రసింగ్ ధోనీ తరువాతే ఎవరైనా. హోరాహోరీ మ్యాచ్ల్లో ధోనీ చేసిన స్టంప్ అవుట్లు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. కొన్ని సంవత్సరాల నుంచి వికెట్ల వెనుక మహీ ఉన్నాడంటే ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా క్రీజులోంచి కదిలేందుకు కాస్త ఆలోచించాల్సిందే. అంత కచ్చితత్వంతో కీపింగ్ చేసే ధోనీ నుంచి నేర్చుకోవడానికి యువ క్రికెటర్లు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
తాజాగా ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ ధోనీని సంప్రదించి కీపింగ్ మెళకువలు, సలహాలు తీసుకున్నాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై ఇన్నింగ్స్లో ధోనీని స్టంపింగ్ చేసే అవకాశాన్ని కిషన్ చేజార్చుకున్నాడు. బంతిని అందుకున్న వెంటనే క్షణాల్లో స్టంపింగ్ చేయడంలో కొంత ఆలస్యం చేయడంతో తేరుకున్న ధోనీ మెరుపు వేగంతో బ్యాట్ను క్రీజులో పెట్టేశాడు. మ్యాచ్ అనంతరం ఇషాన్కు ధోనీ కొన్ని విలువైన కీపింగ్ సలహాలు సూచనలు చేశాడు. విశేషమేంటంటే ధోనీ, ఇషాన్ ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాడే.
దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శనివారం జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ కాస్తంత మెరుగైంది. ఈ ఓటమి ప్రభావం సన్రైజర్స్ హైదరాబాద్ మీద పడింది. రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ విజయం సాధించడంతో మళ్లీ మే 5వ తేదీ వరకూ స్థానానికి తడబాటుండకపోవచ్చు.