
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్కి గాను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంఛైజీకి ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వెసులబాటు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా, జడేజాలను తీసుకుంటామని గతంలో చెన్నై ప్రాంఛైజీ ప్రకటించింది.
తాజాగా అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితా నుంచి రవీంద్ర జడేజా పేరుని తొలగించినట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో మరో యువ క్రికెటర్ని తీసుకోవాలనే యోచనలో చెన్నై ఉన్నట్లు తెలుస్తోంది. 'మేము కచ్చితంగా ధోని, సురేశ్ రైనాలను అట్టిపెట్టుకుంటాం. ఇక మూడో క్రికెటర్ ఎంపికపై ఇంకా చర్చిస్తున్నాం' అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్ 2018 సీజన్ కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో నిర్వాహకులు వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే వెసులుబాటుని ఐపీఎల్ నిర్వాహకులు కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో.. జనవరి 4లోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి ఫ్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంది.
కాగా, ఐపీఎల్ 2018 సీజన్ ఆరంభానికి ముందే అదరగొడుతుంది. ఐపీఎల్ పది సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు వేలం పాటను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేసేవాళ్లు. కానీ ఈసారి మాత్రం వేలానికి ముందు జరిగే ఈ అటిపెట్టుకునే కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయించారు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్లిస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే కార్యక్రమం గురువారం ముంబైలోని తాజ్ లాండ్స్ ఎండ్లో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేకంగా ప్రసారం చేయనుంది.