హైదరాబాద్: దాదాపు ఐపీఎల్ 2018 సీజన్ చరమాంకానికి చేరుకుంది. ప్రతి జట్టు లీగ్ దశలో చివరి మ్యాచ్ను ఆడబోతుంది. ఇక తర్వాతి ఘట్టం ప్లేఆఫ్ రేసే. అయితే ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం తక్కిన ఐదు జట్లు పోటీపడుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ డేర్డెవిల్స్ చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది.
దీంతో శుక్రవారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో స్వేచ్ఛగా ఆడేయాలని ఢిల్లీ ఆశిస్తోంది. మరోవైపు లీగ్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకునేందుకు చెన్నై ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం 18 పాయింట్లతో హైదరాబాద్ నెం.1 స్థానంలో ఉండగా.. చెన్నై 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే.. నెట్రన్ రేట్లో మాత్రం హైదరాబాద్ కంటే.. చెన్నై జట్టే మెరుగ్గా ఉంది.
కాగా, గురువారం జరిగిన మ్యాచ్తో కలిపి హైదరాబాద్ 13మ్యాచ్లు ఆడి చెన్నై మ్యాచ్ కంటే ఒకటి ఎక్కువలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టాప్ పొజిషన్లోకి చెన్నై చేరిపోయినట్లే. ఈ క్రమంలో సీజన్ ఆరంభం నుంచి చెన్నై ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ మెరుపు ఆరంభాల్ని నమోదు చేస్తున్నారు. మిడిలార్డర్లో సురేశ్ రైనా, ధోనీ, బ్రావో నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నారు.
గత ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పూణె వేదికగా అంబటి రాయుడు మెరుపు సెంచరీ చేశాడు. దీంతో ఆ జట్టుకి ఒంటి చేత్తో విజయాన్ని అందించినట్లైంది. మరోవైపు ఢిల్లీ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, జాసన్ రాయ్ మెరుగ్గా ఆడుతుండగా.. మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ హిట్టింగ్తో ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ జరగనున్న కోట్లా మైదానంలో బౌండరీ లైన్ చిన్నదిగా ఉండటంతో.. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.